పాకిస్తాన్ కు మోడీ బిగ్ వార్నింగ్

పాకిస్తాన్ కు మోడీ బిగ్ వార్నింగ్

పాకిస్తాన్ కు మోడీ బిగ్ వార్నింగ్
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ, జూన్ 18 : 
సభ్య దేశం కాకపోయినా భారత్‌కు ఈ ఏడాది జీ7 సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం లభించడంతో ప్రధాని మోదీ కెనడాకు వెళ్లారు. అదే వేదికగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పాక్ తీరును ఎండగట్టారు. కెనడాలోని కనానిస్కిస్‌లో మంగళవారం జరిగిన G-7 సమ్మిట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. G-7 సమ్మిట్ సందర్భంగా దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అధినేతలను కలిశారు. తనకు అవకాశం ఇచ్చిన నేతలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగిన G7 ఔట్రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన జరిగిన ఉగ్రవాద దాడి కేవలం ఆ ప్రాంతం మీద దాడి మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి గుర్తింపు, గౌరవంపై జరిగిన దాడి. ఇది మొత్తం మానవాళిపై జరిగిన ఉగ్రదాడి. ఉగ్రవాదం మానవాళికి శత్రువు, అది ప్రతి ఒక్కరికీ ముప్పులాంటిది. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే అన్ని దేశాలకు వ్యతిరేకం. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం, మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలి. ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందో అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది." అన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒకవైపు అన్ని రకాల ఆంక్షలు విధించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. మరోవైపు, ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలకు రిటర్న్ గిఫ్ట్‌లు సైతం లభిస్తున్నాయి. దురదృష్టవశాత్తు, గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక సంబంధిత సంక్షోభాలతో వారు ప్రభావితం అవుతున్నారు. ఆ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి, సమస్యలను ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారతదేశం తన బాధ్యతగా భావిస్తుందని'' పేర్కొన్నారు.ప్రధాని మోదీకి కనానిస్కిస్‌లో కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఘన స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 'X'లో పోస్ట్ చేస్తూ, ''ప్రపంచ పురోగతి, సహకారం కోసం అడుగులు పడుతున్నాయి. కెనడా ప్రధాని మార్క్ జె. కార్నీ కెనడాలోని కనానిస్కిస్‌లో జరిగిన G-7 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారని'' అని రాసుకొచ్చారు.
ట్రంప్ కు డైరక్ట్ కౌంటర్....
భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి మోదీకి గట్టి డోస్‌ ఇచ్చారు. “మీకు అంత సీన్‌ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్‌ తీసుకున్నంత పనిచేశారు. మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ ట్రంప్‌కి తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. భారత్‌, పాక్‌ మధ్య ట్రంప్‌ మధ్యవర్తిత్వం ప్రకటనను ప్రధాని మోదీ ఖండించారు. జమ్ముకశ్మీర్‌పై భారత్‌-పాక్‌ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు.ట్రంప్‌ విజ్ఞప్తి మేరకు 35 నిమిషాల పాటు మోదీ ఫోన్‌ కాల్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా.. “కాల్పుల విరమణపై పాక్‌తో మేం నేరుగా చర్చించాం. పాక్‌ విన్నపం మేరకు కాల్పుల విరమణపై చర్చించాం. ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతూనే ఉంది.” ప్రధాని అన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ నేరుగా ట్రంప్‌కే చెప్పాల్సి ఉంది. కానీ కెనడాలో ఇద్దరు నేతల సమావేశం జరగలేదు. కానీ ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌- హుటాహుటిన అమెరికాకు బయల్దేరారు. మోదీని కలుసుకోలేకపోయిన ట్రంప్‌, ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి వివరించారు.కెనడాలో G7 సమ్మిట్‌లో పాల్గొని ప్రధాని మోదీ క్రొయేషియా వెళ్లారు. దానికి ముందు తిరుగు ప్రయాణంలో అమెరికా వస్తారా అని ట్రంప్ ప్రధాని మోదీని అడిగారు. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా అది కుదరదని మోదీ, ట్రంప్‌తో అన్నారు. అయితే త్వరలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపైనా కూడా చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ నేరుగా మాట్లాడుకోవాలని మోదీ అభిప్రాయపడ్డారు.