ఎన్కౌంటర్లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ హతం
ఎన్కౌంటర్లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ హతం
ప్రజా క్షేత్ర్, శ్రీనగర్ జూలై 28 :
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నారు. ఈ దాడికి తర్వాత అక్కడి నుంచి పరారైన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. తాజాగా సోమవారం జమ్ము కశ్మీర్లో జరిగిన ‘ఆపరేషన్ మహదేవ్’లో పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ అలియాస్ మూసాను మట్టుబెట్టారు.మహదేవ్ పర్వత ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్కి ‘ఆపరేషన్ మహదేవ్’గా నామకరణం చేశారు. మహదేవ్ పర్వత ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో ఉదయం 11.30 గంటల నుంచి భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. దాచిగాం ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ముగ్గురు ముష్కరులను హతమార్చారు. మృతుల్లో మూసాతో పాటు అబూ హమ్జా, యాసిర్లు ఉన్నారు. ఈ ఇద్దరూ పహల్గాం దాడిలో పాల్గొన్నారు. డ్రోన్ల ద్వారా మృతదేహాలను గుర్తించి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉగ్రవాదుల నుంచి ఎకె 47 రైఫిల్స్, 17 గ్రానైడ్లు స్వాధీనం చేసుకున్నారు.