తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటి
రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, యువత వీరోచిత పోరాటం
*కాసిం రీజ్వీ రజాకార్ సైన్యం గుండ్రంపల్లి, వీరభైరానపల్లి, పర్కల, గొరాట వంటి గ్రామాలపై దాడి చేసి వందలాది అమాయకులను ఊచకోత కోసింది
*తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటిగా నిలిచింది
*గుండ్రంపల్లి అమరవీరులకు మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఘన నివాళ్ళు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ సెప్టెంబర్ 2 :
స్సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా నల్గొండ జిల్లా గుండ్రంపల్లి గ్రామంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన 300 మందికి పైగా అమరవీరులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు , మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ నర్సయ్య గౌడ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం, యువత వీరోచిత పోరాటం చేసింది. కాసిం రీజ్వీ రజాకార్ సైన్యం గుండ్రంపల్లి, వీరభైరానపల్లి, పర్కల, గొరాట వంటి గ్రామాలపై దాడి చేసి వందలాది అమాయకులను ఊచకోత కోసింది. తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద మరణకాండలలో గుండ్రంపల్లి ఒకటిగా నిలిచింది” అని తెలిపారు.వీరభైరానపల్లి ఘటనలో 200 మంది, గుండ్రంపల్లిలో 350 మందికి పైగా, పర్కలలో 22 మంది (150 మంది గాయాలు), గొరాట గ్రామంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.అలాగే రజాకార్ల నేత ఖాసీం రీజ్వీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో పాకిస్తాన్కు పంపడం చరిత్రలో మరక అని వ్యాఖ్యానించారు. “సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జోక్యంతో తెలంగాణ విముక్తి సాధ్యమైంది. అదే రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కూడా ఉండటం యాదృచ్చికం” అని అన్నారు.నల్గొండ జిల్లా రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రబిందువుగా నిలిచిందని గుర్తు చేస్తూ, “ఈ ప్రాంతంలోని పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా గుండ్రంపల్లిలో జాతీయ స్థాయిలో అమర వీరుల స్ఫూర్తి చిహ్నం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా జరపాలి” అని ఆయన స్పష్టం చేశారు.బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత అమర వీరులు ప్రాణత్యాగం చేసిన ఈ నాలుగు ప్రాంతాల్లో అధికారికంగా స్మారక స్థూపాలు నిర్మించి, రాష్ట్ర స్థాయిలో విమోచన దినోత్సవాన్ని జరిపే కట్టుబాటు ఉందని ఈ సందర్భంగా తెలిపారు.