సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు

సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు

ఓట్ల చోరీ వ్యవహారం లో రాహుల్‌గాంధీ ఆరోపణలను తిప్పి కొట్టిన బీజేపీ
సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు  
బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌   అమిత్ మాలవీయ  సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ ఆగష్టు 13 :
దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బీజేపీ   కేంద్ర ఎన్నికల సంఘం   కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్‌  అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది.ఈ మేరకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని  లక్ష్యంగా చేసుకుని హస్తం పార్టీపై విరుచుకుపడింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం  పొందకముందే ఓటర్ల జాబితాలో   ఆమె పేరు  ఉందని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌   అమిత్ మాలవీయ  సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందు ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని మాలవీయ తెలిపారు. విదేశీ పౌరురాలైన సోనియా గాంధీ పేరును భారత ఓటర్ల జాబితాతో చేర్చి కాంగ్రెస్‌ అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక చిత్రాన్ని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో సోనియా గాంధీ పేరు స్పష్టంగా ఉందని, ఒక విదేశీ పౌరురాలికి ఇది ఎలా సాధ్యమైంది..? అంటూ ప్రశ్నించారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు.ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అయితే, ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవ్వడంతో ఆమె పేరును తొలగించారు. 1983 జనవరిలో తిరిగి చేర్చారు. ఆ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం మంజూరయినట్లు మాలవీయ తన ఎక్స్‌ ఖాతాలో వివరించారు.