భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి
భారీ వర్షాలకు హిమాచల్ అతలాకుతలం.. 51 మంది మృతి
ప్రజా క్షేత్ర్, సిమ్ల జూలై 2 ; హిమాచల్ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నదులకు వరద ప్రవాహం పెరిగింది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకూ 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జూన్ 20 నుంచి జులై 2 వ తేదీ వరకూ రాష్ట్రంలో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ‘ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 51 మంది మరణించారు. దాదాపు 22 మంది గల్లంతయ్యారు. మండి జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 103 మంది గాయపడ్డారు’ అని సదరు నివేదికలో వెల్లడించింది.