తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతాం : రేవంత్రెడ్డి
తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతాం : రేవంత్రెడ్డి
ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం
ప్రజాక్షేత్ర్ , తెలంగాణ బ్యూరో
హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. చాకలి ఐలమ్మ 39 వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. పోరాటయోధురాలిని స్మరిస్తూ ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారంటూ వారిని స్మరించుకున్నారు. ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ దేశంలో భూ సంస్కరణలు తెచ్చారని, భూమి పేదవాడి ఆత్మగౌరవం, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని అన్నారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను కాజేయాలన్న కుట్ర చేశారని, పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం అన్నారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను నృత్య రూపకంగా ప్రదర్శించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.