పాక్ అణ్వాయుధ బెదిరింపుల‌కు త‌లొగ్గం : ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌

పాక్ అణ్వాయుధ బెదిరింపుల‌కు త‌లొగ్గం : ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌

పాక్ అణ్వాయుధ బెదిరింపుల‌కు త‌లొగ్గం
 ఎటువంటి యుద్ధ వ్యూహాల‌నైనా భారత్ తిప్పికొడుతుంద‌న్నారు
రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌
ప్రజా క్షేత్ర్, న్యూఢిల్లీ జూలై 29:
 ఆప‌రేష‌న్ సింధూర్‌పై మంగళవారం  రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చ‌ర్చ‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పాకిస్థాన్ చేప‌డుతున్న అణ్వాయుధ బెదిరింపుల‌కు భార‌త్ త‌ల‌వంచ‌దు అని పేర్కొన్నారు. ఎటువంటి యుద్ధ వ్యూహాల‌నైనా తిప్పికొడుతుంద‌న్నారు. ఉగ్ర‌వాదానికి భార‌త్ వ్య‌తిరేక‌మ‌న్న ఉద్దేశాన్ని చాటేందుకు ఆపరేష‌న్ సింధూర్ సంకేతంగా నిలుస్తుంద‌ని, కానీ గ‌త ప్ర‌భుత్వాలు ద‌శాబ్ధాల క్రిత‌మే ఇలాంటి చ‌ర్య‌ల‌ను చేయాల్సి ఉండే అని అన్నారు.ఒక‌వేళ పాకిస్థాన్ ఉగ్ర‌వాదాన్ని రూపుమాపాల‌నుకుంటే, ఆ దేశానికి స‌హ‌కారం అందించేందుకు భార‌త్‌ సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు ఒకేసారి స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని జరుపుకుంటాయ‌ని, కానీ పాకిస్థాన్‌ను ఉగ్ర‌వాద కేంద్రంగా భావిస్తున్నార‌ని, ఇండియాను మాత్రం ప్ర‌జాస్వామ్యానికి త‌ల్లిగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉగ్ర‌వాదం నుంచి ఎటువంటి విప్ల‌వం పుట్ట‌దు అని, దాని వ‌ల్ల కేవ‌లం విధ్వంసం, ద్వేషమే మిగులుతుంద‌న్నారు. ఉగ్ర‌వాదులేమీ ఫ్రీడం ఫైట‌ర్లు కాద‌న్నారు.ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో పాకిస్థాన్ ఎన్ని యుద్ధ విమానాల‌ను కోల్పోయిద‌న్న విష‌యాన్ని విప‌క్షాలు ఎందుకు అడ‌గ‌డం లేద‌న్నారు. కానీ భార‌తీయ యుద్ధ విమానాల గురించి మాత్ర‌మే ప్ర‌శ్న వేస్తోంద‌ని విమ‌ర్శించారు. ఏదో ఒక రోజు పీవోకే ప్ర‌జ‌లు ఇండియాతో క‌లుస్తార‌ని, భార‌తీయుల‌మ‌ని చెప్పుకునేందుకు వాళ్లు గ‌ర్వ‌ప‌డుతార‌ని రాజ్‌నాథ్ అన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌కు కేవ‌లం కామా మాత్ర‌మే పెట్టామ‌ని, ఫుల్ స్టాప్ పెట్ట‌లేద‌న్నారు.కాల్పుల విర‌మ‌ణకు ఎందుకు అంగీక‌రించార‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ.. ఆప‌రేష‌న్ సింధూర్ ల‌క్ష్యం కేవ‌లం పాకిస్థాన్‌ను శిక్షించ‌డ‌మే అని, కానీ ఆ దేశంపై యుద్ధం చేయ‌డం త‌మ ఉద్దేశం కాద‌న్నారు. పాకిస్థాన్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావ‌రాల‌పై ఇండియా దాడి చేసింద‌ని, ఆ దాడిలో ఒక్క పాకిస్థానీ పౌరుడు కూడా మ‌ర‌ణించ‌లేద‌ని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు.మ‌రో వైపు లోక్‌స‌భ‌లో హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్ర‌సంగంపై ప్ర‌ధాని మోదీ త‌న ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్‌, ఆప‌రేష‌న్ మ‌హాద‌వ్‌పై ఆ ప్ర‌సంగంలో పూర్తి వివ‌రాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.