ప్రపంచ పోలీస్ క్రీడల్లో టీటీడీ సెక్యూరిటీ,విజిలెన్స్ అధికారుల అద్భుత విజయం
ప్రపంచ పోలీస్ క్రీడల్లో టీటీడీ సెక్యూరిటీ,విజిలెన్స్ అధికారుల అద్భుత విజయం
దేశానికి బంగారు, కాంస్య పతకాలు టీటీడీకి గర్వకారణం
విజేతలను అభినందించిన టీటీడీ చైర్మన్, ఈవో
ప్రజా క్షేత్ర్, తిరుమల :
అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్ - 2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటవిజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వెన్నల పతాకాన్ని రెపరెపలాడించారు. 45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజీవో ఎ.సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా, 55 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో ఎన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ద్వైవార్షిక పోటీల్లో టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, టీటీడీకి ఇది ఒక గొప్ప గౌరవంగా నిలిచిందని కొనియాడారు.
అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వీ.వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణలు కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాతీయ స్థాయి విజయం టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగం లోని అధికారుల నైపుణ్యాన్ని, నిబద్ధతను చాటిందని, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ విజయం తోడ్పడిందని పేర్కొన్నారు.