సంక్షేమాన్ని పంచిపెడదాం.. అభివృద్ధిలో భాగస్వాములమౌదాం :చంద్రబాబు నాయుడు

సంక్షేమాన్ని పంచిపెడదాం.. అభివృద్ధిలో భాగస్వాములమౌదాం :చంద్రబాబు నాయుడు

సంక్షేమాన్ని పంచిపెడదాం
అభివృద్ధిలో భాగస్వాములమౌదాం
చంద్రబాబు నాయుడు

ప్రజా క్షేత్ర్, కడప : 
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నన్ను మళ్లీ ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు సవినయంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.  ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అదే ప్రకారం కడప మహానాడులో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. నా పేరు ప్రతిపాదించిన, సమర్థించిన, ఆమోదించిన వారందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు నా పై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, ‘కార్యకర్తే అధినేత’ అనే సూత్రానికి అనుగుణంగా పని చేస్తానని ఈ సందర్భంగా మరొక్కమారు తెలుపుతున్నాను. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్ డి ఏ కూటమి ఘన విజయం సాధించింది. ఆ విజయం మన బాధ్యతను పెంచింది. గాడితప్పిన రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా రంగాల్లో సరిదిద్దాం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నాం. పెట్టుబడుల కోలాహలంతో, పరుగులు పెడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులతో, భవిష్యత్తును అందంగా చూపించే మౌలికసదుపాయాల కల్పనతో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రం ముందడుగు వేస్తున్నది. సంక్షేమాన్ని పంచిపెడదాం… అభివృద్ధిలో భాగస్వాములమౌదాం… భావితరాలకు మార్గదర్శులమౌదాం. ప్రపంచ దేశాల్లో తెలుగువారి సత్తాను చూపే దిశగా పయనిద్దాం. నా జీవితం తెలుగు ప్రజల సేవకే అంకితమని మరొక్కమారు తెలుపుకుంటూ ఈ అద్భుత అవకాశాన్ని నాకు అందించిన వారికి మరోసారి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నానని అన్నారు.