అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా

అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా

అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు పవన్​కళ్యాణ్ భరోసా

ప్రజా క్షేత్ర్, ఏపీ బ్యూరో 

విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలను ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కలిసి, పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏడుగురు మృతి చెందడం విచారకరమని, పలువురు ఆసుపత్రి పాలు కావడం ఆవేదన కలిగించిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా, నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. బాధితులు చెప్పిన విషయాలను ఓపికగా విని, సమస్యలను తీర్చేలా పని చేస్తామని భరోసా ఇచ్చారు. శుద్ధి చేసిన తాగునీరు ప్రతి కుటుంబానికి అందేలా 'జల జీవన్ మిషన్' పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలియజేశారు.