ఇరాన్లోని ఆరు వైమానిక క్షేత్రాలపై దాడి.. 15 విమానాలు ధ్వంసం: ఇజ్రాయిల్
ఇరాన్లోని ఆరు వైమానిక క్షేత్రాలపై దాడి.. 15 విమానాలు ధ్వంసం: ఇజ్రాయిల్
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 23 :
ఇజ్రాయిల్ రక్షణ దళాలు(IDF) ఇవాళ కీలక ప్రకటన చేశాయి. ఇరాన్లో ఉన్న వైమానిక క్షేత్రాలను టార్గెట్ చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు ఆరు విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ మిలిటరీ అటాక్ చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది తన ఎక్స్ అకౌంట్లో ఐడీఎఫ్ ఈ విషయాన్ని చెప్పింది. రిమోట్ ఎయిర్క్రాఫ్ట్లతో జరిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. దాడుల వల్ల విమానాశ్రయ రన్వేలు, అండర్గ్రౌండ్ బంకర్లు, రీఫుయలింగ్ విమానం, ఎఫ్-14, ఎఫ్-5, ఏహెచ్-1 విమానాలు ధ్వంసమైనట్లు ఐడీఎఫ్ తన ఎక్స్లో వెల్లడించింది. టార్గెట్ చేసిన విమానాశ్రయాల్లో మెహ్రబాద్, మాషద్, డెజ్ఫుల్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాల్లో టేకాఫ్ జరగకుండా ఉండే రీతిలో ఇజ్రాయిల్ మిలిటరీ అటాక్ కొనసాగించింది. ఇరాన్ ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు చెప్పింది.సుమారు 20 యుద్ధ విమానాలు.. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దాడులకు పాల్పడినట్లు ఐడీఎఫ్ తెలిపింది. కెర్మన్షా, హమేదీన్, టెహ్రాన్ సైట్లపై సుమారు 30 బాంబులతో ఇజ్రాయిల్ దాడి చేసింది. మిస్సైల్ స్టోరేజ్, లాంచ్ కేంద్రాలతో పాటు రేడార్, శాటిలైట్ సిస్టమ్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంచర్ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిలువరించడంతో పాటు ఇజ్రాయిలీ పౌరులపై వైమానిక దాడులు చేయకుండా ఉండేందుకు అటాక్ చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది.