మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం : రేవంత్ రెడ్డి

ప్రజాక్షేత్ర్, తెలంగాణ బ్యూరో

తెలంగాణ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ధేశించే కార్యాచరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం అయిదు ప్రముఖ సంస్థలతో కలిసిన కన్సార్షియమ్ కు పనులు అప్పగించినట్టు తెలిపారు. ఈ కన్సార్షియమ్ వచ్చే 18 నెలల్లో డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (#DPR), ప్రాజెక్టుకు కావలసిన నిధులు, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలను  అధ్యయనం చేసి నివేదిస్తుందని చెప్పారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి  సచివాలయంలో మీడియా సమావేశంలో సమగ్రంగా వివరించారు. అనేక సందేహాలను నివృతి చేశారు. ప్రజల్లో అపోహలు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది మూసీ సుందరీకరణ కాదు. ఇది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంపిక చేసిన కన్సార్షియమ్ లోని అయిదు కంపెనీలు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పూర్తి చేసిన అనేక కీలకమైన ప్రాజెక్టుల వివరాలను వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఈ కన్సార్షియమ్ కోసం ప్రభుత్వం 141 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. 1.50 లక్షల కోట్ల రూపాయలంటూ జరుగుతున్నది కొందరు కావాలని చేస్తున్న ప్రచారం మాత్రమేనన్నారు. ఇంకా డీపీఆర్ పూర్తి కాలేదు. ఆరు నుంచి ఆరున్నర సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా కొందరు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మురికి కూపంగా మారిన మూసీ పరీవాహక ప్రాంతంలో దుర్భర జీవితం గడుపుతున్న వారిని ఆదుకుంటాం. మూసీ పునరుజ్జీవనం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నిర్వాసితులను అక్కున చేర్చుకోవాలన్నది ప్రభుత్వ సంకల్పం. నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రతిపక్షాలు సరైన సూచనలు, సలహాలతో ముందుకు రావాలి. అవసరమైతే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రత్యామ్నాయాలపై చర్చించడానికి సిద్ధం. ఎవరైనా ఎలాంటి ప్రతిపాదనలైనా ఇవ్వొచ్చు. అపోహలు, అనుమానాలు సృష్టించి గందరగోళ పరచొద్దు. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో వస్తే ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మునుషులే కాదు వారి మనసులను కూడా గెలవాలి. మూసీ పునరుజ్జీవన కోసం సంప్రదింపులే ముఖ్యం. నిర్వాసితులకు అండగా నిలవడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకుంటాం. పర్యావరణ వేత్తలు, విద్యా వేత్తలు, సంపాదకులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. బాధితులకు నష్టపరిహారం ఎంతమేరకు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలన్న అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, వామపక్ష పార్టీలతో పాటు పాత్రికేయులు కూడా రాత పూర్వకంగా ప్రతిపాదనలు, సూచనలు చేయాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉంటే ముందుకు రండి. మాకు ప్రజలిచ్చిన బాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నాం. హైడ్రాకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముడిపెట్టొద్దు. సలహాలు, సూచనలు ఇవ్వకుండా కేవలం ప్రజల్లో అనుమానాలు, అపోహలు కలిగించొద్దు. మూసీ గర్భంలో కొందరు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం ఎక్కడా కూల్చివేతలకు పాల్పడలేదు. వారికి మంచి జీవితం కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే 1600 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చాం. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చెరువులు, కుంటలు, నాలాలు పోయాయి. మూసీని కూడా కాలగర్భంలో కలిపి చరిత్ర హీనులుగా మిగిలిపోదామా.... ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతో ముందుకొచ్చింది. భారీ వర్షాలొచ్చినప్పుడు ముంచెత్తిన వరదలతో బెంగళూరు, చెన్నై, వయనాడ్ లాంటి నగరాలు అతలాకుతలమైన పరిస్థితులను చూశాం. ఇటీవల ఖమ్మం, విజయవాడల్లో వచ్చిన వరదలు ఎలాంటి విపత్తును సృష్టించాయో కళ్లముందే ఉదాహరణలుగా ఉన్నాయి. ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని 4 కోట్ల ప్రజలను నిర్దేశించబోతోంది. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఈ మీడియా సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, కన్సార్షియమ్ లోని ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.