పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ గా టాస్కా సభ్యుడిని తీసుకోవాలి
పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ గా టాస్కా సభ్యుడిని తీసుకోవాలి
* కాచారం సమావేశం లో ప్రభుత్వాన్ని కోరిన జిల్లా టాస్కా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట వెంకటేశం
* స్థానిక యాదగిరిగుట్ట దేవస్థానం లో వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించాలని మండల అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య డిమాండ్
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట, జూన్ 30 జూన్ 30 : వయోజనులకు అండగా టాస్కా ( తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్) నిలబడుతుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా టాస్కా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట్ల వెంకటేశం పునరుద్ఘాటించారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మండల టాస్కా అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత మండల టాస్కా ప్రధాన కార్యదర్శి పులుగం చక్రపాణి గ్రామ వయోజనులకు స్వాగతం పలికారు. చట్టం ద్వారా వయోజనులకు చేకూరి న రక్షణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రయోజనాలు తదితర అనేక అంశాలపై ఎర్రగుంట్ల వెంకటేశం సుదీర్ఘంగా ప్రసంగించారు. వృద్దాప్యం లో ఒంటరి తనానికి లోనుకావద్దని, గ్రామం లో వయోజనులు సంఘటితంగా వుంటే సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయన్నారు. ఉన్న ఆస్తులు పిల్లల పేరు మీద రాసేసి తర్వాత ఇబ్బందులకు గురి కావద్దని, చరమాంకంలో వీలునామా రాసి జాగ్రత్తలు పడవచ్చునని ఆయన సూచించారు. జిల్లాలో 425 కేసులలో వయోజనులకు టాస్కా అండగా నిలిచి ఎలా న్యాయం కోసం పోరాడిందో అనేక సంఘటనలను ఆయన వివరించారు. ప్రతి పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్ సభ్యుడుగా టాస్కా సభ్యుడిని తీసుకోవాలని, తద్వారా గ్రామ వయోజనులకు స్థానికంగా సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలతో టాస్కా కు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని ఆయన స్పష్టం చేశారు.మండల టాస్కా అధ్యక్షుడు ముడుంబై జయమోహనా చార్య మాట్లాడుతూ రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న వయోజనుల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాలని కోరారు.వృద్ధులకు ప్రత్యేకంగా ఆశ్రమాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయంలో ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ఒకగంట చొప్పున వృద్ధులకు ఉచిత దర్శనం కల్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా దాదాపు వందమందికి పైగా పాల్గొన్న వయోజనులు ఒకటిరెండు రోజుల్లో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా టాస్కా సంయుక్త కార్యదర్శి బండారు బిక్షపతి, భువనగిరి మండల అధ్యక్షుడు పి రోమన్ తోపాటు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రాగి సహదేవ్, మండల కమిటీ నాయకులు నూకల సుధాకర్ రెడ్డి, గుంటి యాదగిరి, గుండ్లపల్లి మల్లేశం గౌడ్, గౌడ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.