ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివి : రేవంత్ రెడ్డి
ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివి : రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు, ప్రముఖ ఇస్లాం పండితుడు, రచయిత మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మాని గారు రచించిన "Prophet for the World" పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.ముహమ్మద్ ప్రవక్త బోధనలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమని ముఖ్యమంత్రి అన్నారు. విద్వేష భావనల నుంచి దేశాన్ని, పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకోవాలంటే ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ఆచరణీయమని పేర్కొన్నారు. రాజకీయాలు, ఎన్నికల్లో పరస్పరం తలపడినా, అభివృద్ధి విషయంలో మాత్రం అందరితో కలిసి పని చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూసీ, ఈసా నదుల ప్రక్షాళన పనుల్లో స్థానిక ఎంఐఎం పార్టీ సహకారం తీసుకుంటున్నామని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా పేదల సంక్షేమం, అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని తెలిపారు. రాబోయే 10 సంవత్సరాలు ప్రజా ప్రభుత్వానికి అన్ని వర్గాలు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.ఆరాంఘర్ లోని మెట్రో కన్వెన్షన్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం తో పాటు ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ అలీ షబ్బీర్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, TMRIES చైర్మన్ ఫహీం ఖురేషి , తదితరులు పాల్గొన్నారు.