బూర్గంపాడు ఘటనపై నివేదిక కోరాం : మంత్రి కొండా సురేఖ
బూర్గంపాడు ఘటనలో నివేదిక కోరాం
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
సురేఖతో ఫోన్ లో ఘటన వివరాలు తెలుసుకున్న మంత్రి సీతక్క
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి ఫారెస్ట్ బీట్లో లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనపై తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఫారెస్ట్ భూమికి కందకాలు తవ్వేందుకు వెళ్లిన జేసీబీని కొసగుంపుకు చెందిన వలస ఆదివాసీ మహిళలు అడ్డుకున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఘర్షణ విషయంలో మంత్రి సురేఖ, జిల్లా అటవీ అధికారులను, జిల్లా ఉన్నతాధికారులను నివేదిక కోరుతానని చెప్పారు. ఈ మేరకు మంత్రి సురేఖ మీడియాకి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కందకాలు తవ్వకుండా జేసీబీకి అడ్డుగా మహిళలు బైఠాయించగా, ఫారెస్ట్ అధికారులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వలస ఆదివాసీ మహిళలకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇదే విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క కూడా మంత్రి సురేఖతో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడారు. నివేదిక వచ్చిన తర్వాత తదనుగుణంగా ముందుకు వెళదామని అటవీ మంత్రి సురేఖ, సీతక్కకు హామీనిచ్చారు.