జూలై 11 వ తేదీన లాల్ దర్వాజా బోనాలు
జూలై 11 వ తేదీన లాల్ దర్వాజా బోనాలు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లాల్దర్వాజా శ్రీ మహంకాళి 117వ వార్షిక బోనాల జాతర ఉత్సవాలు జూలై 11 వ తేదీన ప్రారంభం కానున్నాయని ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్ తెలిపారు. ఆదివారం లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి పాల్గొని వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జూలై 11వ తేదీన ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాలు 21వ తేదీవరకు కొనసాగుతాయన్నారు. జూలై 11వ తేదీన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవి అభిషేకం, ద్వజా రోహణ, శిఖర పూజ, సాయంత్రం కలశస్థాపనతో ఉత్సవాలు లాంచనంగా ప్రారంభమవుతాయన్నారు. జూలై 13 వ తేదీన సాయంత్రం శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటమును భాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. అనంతరం 9రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. జూలై 20వ తేదీన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి బోనాల సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతి కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. జూలై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, అమ్మవారి భవిష్య వాణి వినిపించే రంగం కార్యక్రమం, అమ్మవారి బ్రహ్మాండమైన సామూహిక ఘటాల ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.