తెలంగాణలో MSME లు బలపడాలి : రేవంత్ రెడ్డి
తెలంగాణలో MSME లు బలపడాలి : రేవంత్ రెడ్డి
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
తెలంగాణలో MSME లు బలపడాలని, రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి పరిశ్రమలు రాణించాలని, అందుకు ప్రజా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక పాలసీ లేకుండా ఏ రంగం కూడా అభివృద్ధి సాధించలేదని, అందుకే తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా #MSME Policy-2024 తీసుకొచ్చాం” అని అన్నారు. MSME లు బలపడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, అందుకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్య సాధనలో మీరంతా భాగస్వామిగా ఉండాలని MSME లకు పిలుపునిచ్చారు. తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి 7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానని, అందుకు MSME సహాకారం ఉంటుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలను కొనసాగిస్తామని, పెండింగ్ రాయితీలను కూడా చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించాలన్నదే లక్ష్యం. ఈ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుంది. పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.” అని చెప్పారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఆ వర్గాలకు అవసరమైన భూముల కేటాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అనేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఆ కోవలోనే తెలంగాణలో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశామని చెప్పారు. ఓఆర్ఆర్, దానికి సమాంతరంగా రీజినల్ రింగ్ రోడ్డు, ఈ రెండింటి మధ్య రేడియల్ రోడ్లతో పెట్టుబడుల కోసం సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను రచించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడుల కోసం అనేక దేశాలు చైనా ప్లస్ వన్ బాట పట్టాయని, పెట్టుబడులకు ప్రత్యామ్నాయం తెలంగాణ మాత్రమేనని ఈ రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.